ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన నెల్లూరు జిల్లా పర్యటనను ఆదివారం నుంచి ప్రారంభించారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది. సినీ నటనకు స్వస్తి చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ఈ జిల్లాకు తొలిసారి వచ్చారు. ఈ జిల్లాతో ఎంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న చిరంజీవి పార్టీ ఏర్పాటుకు ముందు గాని, ఆ తరువాత గాని నెల్లూరులో పర్యటించలేదు. మొదటిసారిగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తడ మండలం సరిహద్దు గ్రామమైన పన్నంగాడు నుంచి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి 11 గంటలకు సూళ్ళూరుపేట చెంగాళమ్మ గుడిలో పూజలు చేస్తారు. పిమ్మట స్థానిక హైస్కూల్ మైదానంలో ప్రజా అంకిత సభలో ప్రసంగిస్తారు. ఒంటి గంటకు నాయుడుపేట వద్ద రోడ్షోలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు వెంకటగిరి విశ్వోదయ కళాశాల మైదానం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి బాలాయపల్లి, చెన్నూరు మీదుగా ఆరు గంటలకు గూడూరుకు చేరుకుని స్థానిక ఆదిశేషారెడ్డి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఐదో తేదీ ఉదయం పది గంటలకు బయలుదేరి పొదలకూరుకు చేరుకుంటారు. 11 గంటలకు పొదలకూరులో జరిగే ప్రజా అంకిత సభలో చిరంజీవి ప్రసంగిస్తారు. అనంతరం కసుమూరుకు చేరుకుని అక్కడి దర్గాలో పూజలు చేస్తారు. అనంతరం వెంకటాచలంలోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద భోజనం చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ముత్తుకూరు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి ఆరు గంటలకు నెల్లూరు వీఆర్సీ మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆరో తేదీ ఉదయం 11 గంటలకు కోవూరు సాయిబాబా మందిరం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బుచ్చి, సంగం రోడ్షోలలో నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరు జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి వింజమూరుకు చేరుకుని, స్థానిక కళాశాల మైదానంలో జరిగే సభలో మాట్లాడుతారు. అక్కడ నుంచి కావలికి చేరుకుని ఏబిఎం కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఏడో తేదీ ఉదయం 10 గంటలకు కావలి నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లాకు వెళుతారు. |