భారతదేశంలో జీవిస్తూ, ఇక్కడి స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ బ్రిటీష్ పాలనను గొప్పదిగా అభివర్ణించిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దేశద్రోహి అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆదివారం వరంగల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవిపై నిప్పులు చెరిగారు.
భారతదేశాన్ని బానిస సంకెళ్లతో బంధించిన బ్రిటీష్ వారి పాలన గొప్పదిగా అభివర్ణించిన చిరంజీవి దేశద్రోహి కాక దేశభక్తుడు అవుతాడా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. అబద్ధాలతో పార్టీని నడిపే చిరంజీవి తక్షణం రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమాత్రం రాజకీయ అవగాహన లేని చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పాలకులను విమర్శిస్తున్న ప్రజారాజ్యం పార్టీ నేతలకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన కంటే బ్రిటీష్ వారి పాలనే నయమని చిరంజీవి అని శనివారం చేసిన వ్యాఖ్యలకు పొన్నాల నేడు ప్రతిస్పందించారు. |