ప్రజారాజ్యం పార్టీకి ఉన్న ప్రజాబలం ముందు ధన, కండబలాలు దిగదుడుపేనని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఆదివారం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనను చేపట్టిన విషయం తెల్సిందే. ముందుగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా అంకిత సభలో ప్రసంగించాడు. ఇందులో అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని అధికారపక్షం రోడ్షోలను కోర్టు మూలంగా అడ్డుకుందని ఆరోపించారు. తమ సోదరుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలను విమర్శించిన దానిలో ఏమాత్రం తప్పు లేదన్నారు. ప్రజాసమస్యలు చర్చించాల్సిన పవిత్రమైన అసెంబ్లీలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నదాని కంటే తమ తమ్ముడు మాట్లాడిన దానిలో తప్పేమి లేదన్నారు. ప్రజల మనస్సుల్లోని పుట్టిన తమ పార్టీని అణగదొక్కాలని చూస్తే.. నేలకు కొట్టిన బంతిలా ఎగిసి పడుతుందన్నారు. అంతేకాకుండా తమపై వ్యక్తిగత విమర్శలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెపుతారని చిరంజీవి స్పష్టం చేశారు. |