ప్రపంచంలో నాస్తికులు ఆస్తికులు రెండు వర్గాలుగా వున్నవిషయం విదితమే. ఇందులో నాస్తికులు ఏకంగా ఏకమై నాస్తిక మహాసభలను విజయవాడలో ప్రారంభించారు. ముఖ్యంగా ఆస్తికులకు నిలయమైన మన దేశంలో నాస్తికులకు కూడా చోటుంది.
విజయవాడలో ఏడవ ప్రపంచ నాస్తికాభిమానుల మహాసభలు మంగళవారం స్థానిక సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు దేశంలోని పలు రాష్ట్రాలనుంచి అలాగే విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభలను జాతీయ నాలెడ్జ్ కమీషన్ మాజీ ఉపాధ్యక్షుడు పిఎం భార్గవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అదే విధంగా నాస్తిక ఉద్యమం కూడా అభివృద్ధి చెందాలని దీనికి నాస్తిక ఉద్యమ కారులు కృషి చేయాలని ఆయన కోరారు.
ఐహెచ్ఈయూ మాజీ అధ్యక్షుడు లెవిప్రాగిల్ మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు అహింసను ప్రబోధిస్తున్నాయని, కాని మత పెద్దలు మాత్రం హింసను పెంచి పోషిస్తున్నారని, వాటిని తిప్పికొట్టేలా నాస్తికులు ఉద్యమాలు చేపట్టాలని ఆయన సభ్యులను కోరారు. |