రాష్ట్రంలో రోడ్షోలను మళ్లీ నిర్వహించుకునేందుకు అనుమతి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్షోలకు అవసరమైన జనాన్ని సమీకరించుకోవచ్చని హైకోర్టు బుధవారం పేర్కొంది. అంతేకాకుండా రోడ్షోలపై రాష్ట్ర డిజిపి అందజేసిన మార్గదర్శకాలను కూడా సడలించింది. ఫలితంగా రాష్ట్రంలో రోడ్షో రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయి. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రజలకు దగ్గరయ్యేందుకు వీలుగా రోడ్షోలను ఎంచుకున్న విషయం తెల్సిందే. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, సాధారణ జనజీవనానికి తీవ్ర ఆంటకం కలుగుతోందని పేర్కొంటూ కడపకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తొలుత షోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వీటిని సడలించింది. అయితే డిజిపి సూచించిన మార్గదర్శకాలకు అనువుగా షోలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. కానీ, వీటివల్ల షోలు నిర్వహించలేమని పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం హైకోర్టు రోడ్షోలకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రోడ్షోలపై ఇటీవలి కాలంలోనే హైకోర్టు మూడు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. తొలుత షోలపై స్టే విధించిన కోర్టు.. ఆ తర్వాత పాక్షికంగా సడలించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చని తీర్పు ఇవ్వడం గమనార్హం. |