తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెదేపా మహిళా నేత, సినీ నటి కవిత ఆరోపించారు. తన ఇంట్లో పని చేసే పని మనుషులను ఎవరినీ తాను ఏనాడూ చులకనభావంతో చూడలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఇంట్లో పని చేస్తున్న బాలికలను హింసిస్తూ వారిని వేధింపులకు గురి చేసిందన్న ఆరోపణలపై కవితపై ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన విషయం తెల్సిందే.
దీనిపై కవిత స్పందిస్తూ తాను ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరానని, తన రాజకీయ ప్రవేశాన్ని నిరోధించేందుకే కొందరు ఇలాంటి కుట్ర పన్నారని ఆరోపించారు. తన ఇంటిలో పని చేసిన బాలికల పట్ల తానుగాని, తన అనుచరురులుగానీ, కుటుంబసభ్యులుగానీ ఏనాడూ అనుచితంగా ప్రవర్తించలేదని మంగళవారం ఒక ప్రకటనలో కవిత వివరించారు.
అయితే నమోదైన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆమె తెలిపారు. తనపై బనాయించిన కేసులో పోలీసులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి తనకు న్యాయం చేయవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. |