రాష్ట్ర శాసనసభ జరిగే సమయంలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సూచించారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలు మంటకలిపే విధంగా విపక్ష సభ్యులు ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం శాసనసభలో జరిగిన పరిణామాలకు మీడియా ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఒక కారణమని అందువల్ల ఈ ప్రసారాలను నిలిపి వేసే విషయాన్ని పరిశీలించాలని వైఎస్ సూచించారు.
దీనిపై స్పందించిన ఉప సభాపతి కుతూహలమ్మ మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, సీఎం సూచనకు ఎంఐఎంతో సహా పలువురు సభ్యులు సమర్థించారు. ఈ విషయాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి మీడియాకు ధృవీకరించారు. అన్ని కోణాల్లో ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. |