రాష్ట్ర శాసనసభ గౌరవ మర్యాదలను విపక్ష సభ్యులు దిగజార్చారని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి కె.రోశయ్య ఆరోపించారు. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వకుండా పదే పదే అడ్డు తగులుతూ ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదా వేశారు.
విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చించడానికి సమయం కేటాయిస్తానని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వినకుండా సభకు అంతరాయం కలిగించారు. అయినా స్పీకర్ సహనంతో సభ్యులకు సర్ధి చెప్పినా వినలేదు. అప్పుడు సప్పెండ్ చేయవలసి వచ్చిందని రోశయ్య వివరించారు.
అప్పటికీ, సభ్యులు బయటకు వెళ్లక పోవడంతో మార్షల్స్ ద్వారా బయటకు పంపించాలని స్పీకర్ సురేష్ రెడ్డి ఆదేశించారని, ఆ తర్వాతే మార్షల్స్ రంగంలోకి దిగి సభ్యులను జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారన్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న మార్షల్స్తో వాదనకు దిగి, దాడికి పూనుకున్నారన్నారు. ఆ తర్వాత సభ్యులు వారి చొక్కాలు వారే చించుకుని మార్షల్స్ దాడి చేసినట్టుగా వక్రీకరీంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఎంతవరకు న్యాయమని రోశయ్య ప్రశ్నించారు. |