రాష్ట్ర శాసనసభలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలకు సభాపతిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెపుతున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి తెలిపారు. సభను సజావుగా నిర్వహించేందుకు తాను ఎంతో సహనంతో ప్రయత్నించానని అన్నారు. అయినప్పటికీ సభలో విపక్ష సభ్యుల వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదని, అందువల్లే వారిని సస్పెండ్ చేశామని చెప్పారు.
తన నిర్ణయం ప్రకటించిన తర్వాత కూడా సభ నుంచి బయటకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష సభ్యులపై ఉందని, అయినప్పటికీ వారు బయటకు వెళ్లలేదన్నారు. దీంతో మార్షల్స్తో సభ్యులను బయటకు పంపించి వేశామని, ఇది సభలో ఎపుడూ జరిగే విషయమేనని అన్నారు.
అయితే సభలో చోటు చేసుకున్న పరిణామాలు తనను నివ్వెర పరిచాయని స్పీకర్ అన్నారు. సభ కార్యక్రమాలు ఇంత స్థాయికి దిగజారడానికి మేమే (సభ్యులు) కారణమన్నారు. ఇలాంటి రోజును తన జీవితంలో దుర్దినంగా స్పీకర్ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సభా కార్యక్రమాలు నిర్వహించే సభాపతిగా సభలో చోటు చేసుకున్న పరిణామాలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. అంతేకాకుండా ఈ సఘటనపై విచారణకు ఆదేశించానని పూర్తి వివరాలు అందగానే బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సురేష్ రెడ్డి తెలిపారు. |