తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు ప్రరకటించిన ఎన్నికల హామీలపై లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అమలుకు సాధ్యంకానీ హామీలు గుప్పించాయని ఆరోపించారు.
ఈ విషయమై గురువారం జయప్రకాశ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పేదలకు కలర్ టీవీలు ఇస్తామంటూ పేర్కొనడం క్షమార్హం కాదని అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఐదెకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పడం కూడా తప్పంటూ ఆయన మండిపడ్డారు. ఇంతమందికి భూమి ఇచ్చేందుకు ప్రజారాజ్యం ఏదైనా పరిశ్రమ స్థాపిస్తుందా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ప్రజలను మభ్యపెట్టేలా ఈ రెండు పార్టీలు గుప్పించిన ఎన్నికల హామీలపై తాము ఈసీ వద్ద ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో భాగంగా తెదేపా, పీఆర్పీలు గురువారం లెక్కకు మించి హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే.
తాము అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా కలర్ టీవీలు పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించగా, తాము అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు రెండున్నర ఎకరాల మాగాణి భూమి లేదా ఐదెకరాల మెట్ట భూమిని పంపిణీ చేస్తామని ప్రజారాజ్యం ప్రకటించింది. |