రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంటున్న తరుణంలో.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా పాలక పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై బుధవారం సాయంత్రం కసరత్తు చేయనుంది.ఈ నేపథ్యంలో.. తొలివిడత నోటిఫికేషన్ వచ్చే సమయానికి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. మొత్తానికి త్వరలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డీఎస్ తెలిపారు. ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్సార్, డీఎస్లు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని చెప్పారు. మళ్లీ ఢిల్లీ వెళ్ళి ఈ అంశంపై చర్చలు జరుపుతామని డీఎస్ అన్నారు. ఇదిలా ఉండగా... రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ హస్తినలో కుస్తీ పడుతోంది. ఈ జాబితాను ఓ కొలిక్కి తెచ్చేందుకు స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది.సిట్టింగ్ ఎంపీలకు వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానాలే దాదాపుగా ఖరారు కానున్నట్లు పార్టీ శ్రేణుల సమాచారం. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ మూడుసార్లు సమావేశమైంది. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. |