రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి. యాదవ్ను బదిలీ చేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషన్ బుధవారంనాడు ఆదేశించింది. కర్నూలు మీడియా సమావేశంలో డీజీపీ అధికార పార్టీకి అనుకూలంగాను, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినారని గతంలో తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాయి. దీనిపై విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలావుండగా డీజీపీ యాదవ్ స్థానంలో కొత్తగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు సూచించాలని ఈసి ఆదేశించింది. ఈ జాబితాను 20 తేదీ ఉదయం 11 గంటల్లోగా అందజేయాలని ఎన్నికల సంఘం కోరింది. 20వ తేది సాయంత్రానికల్లా కొత్త డీజీపీ నియామకం జరుగనున్నట్లు ఈసి వెల్లడించింది.
కాగా ప్రస్తుతం కె.ఆర్. నందన్, గౌతం కుమార్, ఏ.కె. మహంతి, గిరీష్ కుమార్లు డీజీపీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 1975 బ్యాచ్కు చెందిన ఎమ్.వి. కృష్ణారావు, కె.ఆర్. నందన్, ఏ.కె. మహంతి పేర్లను ప్రభుత్వం సూచించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా యాదవ్ సెలవుపై వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. |