గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన "మీట్ ద ప్రెస్" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా పెంచామని, వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు పంచామన్నారు. తమ హయాంలో పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ నిలుపుకున్నామన్నారు.
పార్టీ ఎన్నికల ప్రణాళికలో అచరణయోగ్యమైన వాగ్ధానాలు మాత్రమే ఇచ్చామన్నారు. ప్రతి పక్షాల విషయానికొస్తే వారు చేసిన వాగ్ధానాలే వారి డొల్లతనాన్ని బయటపెడుతున్నాయన్నారు. వారిచ్చిన హామీల్లో చిత్తశుద్ధి లేదన్నారు. ఆకర్షణీయ పథకాలు చూసి ప్రజలు ఓట్లేసేటట్టయితే ముందుగా వారు ప్రజాశాంతి పార్టీకే ఓటు వేయాలన్నారు.
తెదేపా పేద కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తామని హామీయిస్తే, ప్రజాశాంతి పార్టీ ప్రతి కుటుంబానికీ రూ.లక్ష ఇస్తామని వాగ్ధానం చేసిందన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై పని చేశామన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. |