తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నగదు బదిలీతో సహా అన్ని రకాల పథకాలను అమలుచేసి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోక్ష్ ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి తరపున కుప్పం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన ఆయన పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు.
రోడ్షోల సందర్భంగా ప్రజల నుంచి ఘనస్వాగతం అందుకున్న లోకేష్ ఈ సందర్భంగా తెదేపా తన మేనిఫెస్టోలో పేర్కొన్న కలర్ టీవీలు, నగదు బదిలీ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రాముఖ్యతనిచ్చారు. దీంతోపాటు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, దీపం పథకంలాంటి వాటిని గురించి కూడా ప్రస్తావించారు.
ప్రస్తుతం మేనిఫెస్టోలో పేర్కొన్న నగదు బదిలీ పథకం, కలర్ టీవీలు రైతులకు రుణ మాఫీలాంటి పథకాలను తాము ఎలా అమలు చేస్తామన్న విషయాన్ని ఆయన తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన లోకేష్ వైఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ విమర్శించారు. |