ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లో మార్పు తెస్తుందని భావించానని, అయితే పీఆర్పీలో సామాజిక న్యాయం లేదని ఆ పార్టీ వ్యవస్థాపక అభ్యర్థులు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. ప్రజారాజ్యం స్థాపించిన లక్ష్యం వేరు అని, దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం వ్యవహరిస్తోందని పరకాల ధ్వజమెత్తారు.
ప్రజారాజ్యం పార్టీకి గురువారం రాజీనామా చేసిన అనంతరం మీడియాతో పరకాల మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీకి ఆగ్రహంతో, ఆవేశంతో రాజీనామా చేయలేదని, ఆవేదనతోనే రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పీఆర్పీ పార్టీపై, అధిష్టానంపై ఆ పార్టీ కార్యాలయంలోనే పరకాల ఘాటైన విమర్శనాస్త్రాలను సంధించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ప్రజారాజ్యం ఓ విషవృక్షం లాంటిదని దుమ్మెత్తిపోశారు. పీఆర్పీ రాష్ట్ర రాజకీయాల్ని విషపూరితం చేస్తోందని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిస్తుందనే భావంతోనే, బాధ్యతగా పనిచేశామని, కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని పరకాల విమర్శలు గుప్పించారు. నారాయణ, వెంకటేశ్వరరావు, హారిక, సుజాత, మమతారెడ్డి, స్వామి, కొండయ్య, ఇలా చాలా మందిని పార్టీ మోసం చేసిందని పరకాల అన్నారు. |