రాష్ట్రంలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కానుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం.వెకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్న పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, తెదేపా, పీఆర్పీలు ఇస్తున్న హామీలు ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదని వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పార్టీ ప్రచారం కోసం విశాఖపట్నం వచ్చిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పక్కనబెట్టి రాజకీయ పార్టీలు అలవికాని హామీలకు, పరస్పర దూషణలకు ప్రాముఖ్యమిస్తున్నాయని పేర్కొన్నారు. అదేసమయంలో మీడియా సైతం ఈ తరహా వాటికే ప్రచారం కల్పిస్తున్నాయంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.
టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీలు గుప్పిస్తున్న హామీలు ఏమాత్రం అమలుకావని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాత్రివేళ ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంపై ఈసీ పునరాలోచించాలని కోరారు. రాత్రిపూట ప్రచారంవల్ల ఎన్నికల సమయంలో ధనప్రవాహం ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు. |