ప్రజారాజ్యం పార్టీ తలపెట్టిన ప్రజారైలు రాష్ట్రంలో దూసుకెళుతోంది. తమ ఎన్నికల గుర్తు రైలింజన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజారాజ్యం పార్టీ తలపెట్టిన ప్రజారైలు యాత్రకు తొలిరోజు భారీ స్పందన వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చిరంజీవి జెండా ఊపి ప్రారంభించిన ఈ ప్రజా రైలును చూసేందుకు వివిధ స్టేషన్లకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అదేసమయంలో ఈ రైలులో చిరంజీవి తనయుడు రాంచరణ్తేజ, అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్లు ఉండడంతో వారిని చూసేందుకు జనం పోటెత్తారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ప్రజారైలు యాత్రను శనివారం పీఆర్పీ అధినేత చిరంజీవి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గుర్తు అయిన రైలింజన్ను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో పీఆర్పీ విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ రైలు మూడు రోజుల పాటు రాష్ట్రంలో తిరుగుతూ అనేక స్టేషన్లలో ఆగుతుంది.
వివిధ స్టేషన్లలో ప్రజారైలు ఆగిన సమయంలో రాంచరణ్, అల్లు అర్జున్లు అభిమానులకు అభివాదం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల వారు ఎక్కడా ప్రసంగాలకు శ్రీకారం చుట్టలేదు. అయితే రైలులోంచే మీడియాతో మాత్రం వారు మాట్లాడారు. |