కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరో విడత రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 17వ తేదీన రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని పంగిడి గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. రాజమండ్రి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ నియోజకవర్గంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి అలరిస్తున్న అరుణ్ కుమార్ తన నియోజకవర్గంలో తగినంతగా ప్రచారంలో పాల్గొనలేక పోతున్నారని తెలిసింది.
ఈ స్థానంలో ఇద్దరు ప్రజాదారణ గల హీరోలు పోటీ చేస్తున్నారు. వీరిలో తెలుగుదేశం అభ్యర్థి మురళీ మోహన్, ప్రజారాజ్యం అభ్యర్థిగా కృష్ణంరాజు అక్కడ పోటీలో ఉండగా, వారి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రాజమండ్రి ఉన్నందున, ఉండవల్లిని ఆదుకునేందుకుగాను, తగినంత వ్యవధి లేకపోయినా ఏప్రిల్ 17న పంగిడిలో జరిగే సభకు సోనియా గాంధీ హాజరుకానున్నారు.
అలాగే.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కీలక ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఇదివరకెన్నడూ లేనంతగా పలువురు జాతీయ నేతల తాకిడి పెరిగింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీ గుంటూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన గుంటూరులో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని ఏఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. |