తిరుపతి నియోజకవర్గంలో తనను ఓడించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. సుమారు 20 వేల బోగస్ ఓటర్లను అధికార పార్టీ సృష్టించిందని కర్నూలు జిల్లాలో పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజారాజ్యం విజయాన్ని అడ్డుకోలేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ఇంకా ముగియనేలేదు. 30 లోక్సభ స్థానాలు సాధిస్తే దేశమంతటా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు స్నేహితులు పాలించే పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ముందుగా ఎందుకు అమలు చేయించలేకపోయారో చెబితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, బోగస్ బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేదని చిరంజీవి మరోమారు స్పష్టం చేశారు. పరకాల ప్రభాకర్ తనపైన, అల్లు అరవింద్పైన, ప్రజారాజ్యం పార్టీపైన చేసిన ఆరోపణల్లో అణు మాత్రం నిజం లేదన్నారు. బోగస్ బీసీలకు టిక్కెట్లు కేటాయించామని ప్రభాకర్ చేసిన ఆరోపణ నిరాధారమన్నారు. ఒక వేళ అటువంటి బోగస్ బీసీల జాబితా ఆయన వద్ద ఉంటే బయటపెట్టాలని చిరంజీవి సవాల్ విసిరారు. |