ఫలితాల అనంతరం మెజారిటీని అనుసరించే ప్రజారాజ్యం పార్టీ క్యాంపు శిబిరాన్ని నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకోసం అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ కోరారు. శనివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలన్నారు.
మొదటి, రెండు రౌండ్లలో ప్రరాపాకు ఆశించిన స్థాయిలో ఓట్లు రానంత మాత్రాన నిరుత్సాహపడవద్దన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో పాటు నిశబ్ద ఓటింగ్ జరగడంతో ప్రరాపాకే అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. అందువల్ల అభ్యర్థులంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కౌంటింగ్ ప్రక్రియపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రరాపా అధినేత చిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం ఏర్పాటైనప్పటికీ .. చివరి నిమిషంలో రద్దు అయింది. అయితే అప్పటికే హైదరాబాదుకు చేరుకున్న అభ్యర్థులకు అల్లు అరవింద్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అల్లు పైవిధంగా వ్యాఖ్యానించారు. |