మండుతున్న ఎండలతో కష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఓ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది జూన్ ఒకటిన కేరళలో అడుగుపెట్టే నైరుతి రుతుపవనాలు ఈసారి దాదాపు ఆరురోజుల ముందే రానున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వివరాలలోకి వెళితే ఈనెల 26న నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ రుతుపవనాల కారణంగా దాదాపు 96శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అదేసమయంలో రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చేవి కూడా నైరుతీ రుతుపవనాలే కావడంతో అందరిలో సంతోషం నెలకొంటుందని వాతావరణ శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. దీంతో రుతుపవనాల కారణంగానైనా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయోమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 26న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు అటుపై జూన్ 5నాటికి నెల్లూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి అటుపై 8నాటికి విశాఖ వరకు విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. |