రానున్న ఐదేళ్లలో ప్రజల విశ్వసనీయత కోసమే కృషి చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి గత ఐదేళ్ల పాలనలో చేసిన మేలును గుర్తించి మరో ఐదేళ్ల పాలనకు ప్రజలు అవకాశం కల్పించారని దానిని తాము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
గాంధీభవన్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వైఎస్ మాట్లాడుతూ ఎదిగే కొద్దీ ఒదిగి ఉందామని, బలం పెంచుకున్నందుకు గర్వపడకుండా మరింత ఒదిగి ఉండి ప్రజలకు సేవ చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడమేనని ఆయన ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత నెలకొందని, అభివృద్ధి, సంక్షేమానికి నిస్వార్థంగా అంకితభావంతో కృషి చేస్తూ పారదర్శకంగా పనిచేద్దామంటూ వైఎస్ పిలుపునిచ్చారు. |