ప్రజారాజ్యం పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా పార్టీకి రాజీనామా చేశారు. సైద్ధాంతిక విభేదాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అధ్యక్షుడు చిరంజీవికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నిలకు ముందే పార్టీపై వచ్చిన ఆరోపణలకు నిరసనగా మిత్రా రాజీనామా చేస్తున్నారన్న పుకార్లు అప్పట్లో వచ్చాయి. అయితే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమక్షంలోనే మిత్రా స్వయంగా వాటిని ఖండించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆయన.. ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. ఇది ప్రజారాజ్యం పార్టీకి గట్టి దెబ్బలాంటింది. ఎన్నికలకు ముందు పరకాల ప్రభాకర్ వెళ్లినప్పుడు.. ఒక సందర్భంలో చిరంజీవి మిత్రాను ఉద్దేశించి "మీరు పార్టీలోనే ఉన్నారుగా" అని జోక్ చేస్తూ మాట్లాడారు. అప్పటి నుంచి మిత్రా పార్టీ వ్యవహారాల్లో అంటీ అంటనట్టు వ్యవహరిస్తున్నారు. పీఆర్పీ నిర్మాణంలో మిత్రా కీలక పాత్ర పోషించారు. కాగా, మిత్రా రాజీనామాపై ఆ పార్టీ మరో సీనియర్ నేత హరిరామ జోగయ్య స్పందిస్తూ.. మిత్రా రాజీనామా వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. |