ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై వైఎస్ సర్కారు ఏర్పాటు చేసిన శాసనసభా కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరు ముగిసిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వారిని కమిటీ నుంచి తొలగించి, కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి వుందన్నారు. ఈ కమిటీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరలోనే చేపడుతామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలా వద్దా అనే అంశం ఈ కమిటీ చేతుల్లో లేదని ఒక ప్రశ్నకు మంత్రి రోశయ్య చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణాను ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి ఉన్న అన్ని అవకాశాలను సిఫార్సు చేయడం తమ కమిటీ విధులుగా ఆయన చెప్పుకొచ్చారు. |