దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రానున్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రధాని తిరుపతి పర్యటన ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే, ఆయన రాష్ట్రంలో పర్యటించేందుకు అంగీకరించిన విషయం తెల్సిందే.
ఈ పర్యటనలో భాగంగా, తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఒకరోజు రాత్రి ఆయన తిరుమలలోనే బసచేయనున్నారు. మరుసటి రోజు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరంలో ఎన్.టి.పి.సి.-బిహెచ్.ఇ.ఎల్. సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ పరికరాల సంస్థకు శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం కడపలో నిర్వహించనున్న కిసాన్ రైతు ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, ఆయన అధికారిక పర్యటన పూర్తి వివరాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. |