గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంపై ఆ రాష్ట్రానికి లీగల్ నోటీస్ పంపించినట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జలవనరులపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా పనులు నిర్వహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార నేరం కింద మహారాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు మంత్రి పొన్నాల తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షంలో మంత్రి పొన్నాల మరో మారు నిప్పులు చెరిగారు. ఇప్పుడు మేడలు మిద్దెలు ఎక్కి రాద్దాంతం చేస్తున్న పార్టీలు ఇంతకు ముందే మేల్కొని ఉంటే మహారాష్ట్ర ప్రభుత్వ ఇంత దారుణానికి తెగబడి ఉండేది కాదన్నారు. 1995లో అధికారంలో ఉన్న పార్టీ అప్పుడే ఎందుకు మహారాష్ట్ర చర్యలపై స్పందించలేదని నిలదీశారు. కనీసం 2002లో ఆ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడైనా కళ్ళు తెరిచి ఉంటే బాగుండేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. |