కరీంనగర్ జిల్లాలో అతిసార వ్యాధి బారినపడి 50 మంది అస్వస్థతకు గురైయ్యారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలుతోంది. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపురం పంచాయతీ పరిధిలోని మల్లుపల్లె గ్రామంలో అతిసార వ్యాధి సోకి శనివారం 50 మంది మంచంపట్టారు.
కలుషితమైన నీటి సరఫరా కావడం వలనే వీరికి వాంతులే, విరోచనాలతో పలువురు అస్వస్థతకు గురైయ్యారు. ఈ గ్రామానికి చెందిన పలువురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతిసార వ్యాధి సోకిందని సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది గ్రామంలో మకాం వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. పైప్లైన్ లీకేజీ మూలంగానే మంచినీరు కలుషితమయి అతిసార వ్యాధి సోకిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. |