జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వెల్లడించారు. దేశ రాజకీయాలలో రెండు పార్టీల ఆధిపత్యం ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదని, అందువల్ల ప్రత్యామ్నాయ కూటమి అవసరమని తాము భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
తృతీయ కూటమి విఫలమైనప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలకు తాము ఫుల్స్టాఫ్ పెట్టబోమన్నారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు తగ్గించిన యూపీఏ ప్రభుత్వం అవి ముగిసిన వెంటనే పెంచడం ప్రజలను మోసగించడమేనన్నారు.
ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై మరింత భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ తిరిగి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈలోగా మధ్య కాలంలో ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలు ఇలానే ఉంటాయని కారత్ అభిప్రాయపడ్డారు. |