తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లిలాంటిదని సమైకాంధ్రవాదంతో పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 22 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తనపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని అసలు కలవనే లేదన్నారు. భవిష్యత్లో పార్టీని పటిష్టపరచడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తలసాని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అభిప్రాయంపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని, అందువల్ల గ్రేటర్లోనే తాను చేపట్టిన సమైక్యవాద సర్వేను ఆపిస్తున్నానని శ్రీనివాసయాదవ్ చెప్పారు. సమైక్యవాదం లేకుంటే పార్టీకి ఇబ్బంది అని చెప్పానేగానీ, నష్టమని చెప్పలేదని తలసాని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుతో గురువారం ఉదయం తలసాని శ్రీనివాసయాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అనంతరం తలసాని మీడియాతో పైవిధంగా మాట్లాడారు. |