తెలుగుదేశం పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య స్పష్టం చేశారు. మొత్తానికి తెదేపా నేతలను ఆకర్షించే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని రోశయ్య తేల్చి చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ బస్సులో సీట్లు ఖాళీగా లేవన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై అనవసరంగా అభాండాలు వేయడం, విమర్శలు చేయడం సరికాదని రోశయ్య తెలిపారు. చంద్రబాబు నమ్మదగిన నేత కాదని ప్రజల తీర్పు ద్వారా స్పష్టమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభద్రతా భావంతోనే తెదేపా నేతలు ఆ పార్టీని వీడుతున్నారని రోశయ్య చెప్పారు. మరోవైపు.. ఇదే విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్ముకుంటే లాభం లేదని తెలిసే టీడీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు.1983 లో చంద్రబాబు ఏ పథకానికి ఆకర్షితులై కాంగ్రెస్ను వీడి తెదేపాలో చేరారో చెప్పాలని తులసిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చితే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునని తులసిరెడ్డి తెలిపారు. |