త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారానే నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏవీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆగస్టు నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు.
ఈ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈవీఎం విధానంలోనే నిర్వహిస్తామన్నారు. ఇక్కడ బ్యాలెట్ విధానం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. వార్డుల రిజర్వేషన్లు, డివిజన్ల విభజనలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారం లేదన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చును రూ.50 నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచినట్టు చెప్పారు. అలాగే మేయర్ అభ్యర్థి జనరల్ కేటగిరికి చెందిన వ్యక్తిగా ఉంటారని ఏవీఎస్ స్పష్టం చేశారు. |