రాష్ట్రంలో సాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి హెచ్.ఆర్.మునియప్పతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టులపై హైదరాబాదులోని జూబ్లీహాల్స్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పలు పెండింగ్ పనులను ముఖ్యమంత్రి కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గుంటూరు, కడప, అనంతపురం రైల్వే స్టేషన్లను బహుళ ప్రయోజన స్టేషన్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే, కడప, భీమవరం, నర్సాపురం, మచిలీపట్నం, పెద్దపల్లి, కరీంనగర్, రేపల్లె స్టేషన్లను మోడల్ రైల్వే స్టేషన్లుగా తయారు చేయాలని కోరారు. సికింద్రాబాద్-కర్నూలు మధ్య నడిచే తుంగభద్ర ఎక్స్ప్రెస్ను కడప వరకు పొడగించాలని కోరారు.
తిరుపతి-నెల్లూరు-చెన్నై, విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య ఎలక్ట్రిక్ రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు.. కాచిగూడ- చెన్నై ఎగ్మూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ను మధురై వరకు, హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ను అమృత్సర్ వరకు పొడగించాలని వైఎస్ రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమీక్షా సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.