రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆస్తిపైన విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తెలివైన వ్యక్తి కాదని, వైఎస్కు చరిష్మా ఉండేది కాదని, రాజకీయాల్లోకి వచ్చాకే ఆయన బలపడ్డారని బాబు అన్నారు.
అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్సార్ తన ఆస్తుల విచారణకు సిద్ధమైతే తాను కూడా సిద్ధమని బాబు స్పష్టం చేశారు. తమ ఇద్దరి ఆస్తులపై న్యాయ విచారణ జరిపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ముగిసిన బడ్జెట్ సమావేశాలు: శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో సమాప్తమయ్యాయి. సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకు ముందు ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి కె. రోశయ్య సభలో ప్రవేశ పెట్టారు. బిల్లుని సభ ఆమోదించింది.
మొత్తానికి సభ 27 పని దినాలలో 128 గంటల పదినిమిషాలు జరిగింది. 245 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ఇంకా శాసనసభ సమావేశాల్లో 15 బిల్లులు ప్రవేశపెడితే 14 బిల్లులకు సభ ఆమోదం లభించింది.