ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ముఖ్యమంత్రి పదవిపై చర్చించడం సరి కాదు: చిరు (AP | CM | YSR | Helicopter | Passed away | PRP | Chiranjeevi)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కోరారు. దీంతో చిరంజీవి స్పందిస్తూ... ఇంతటి విషాదకరమైన సమయంలో ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడడం సరైన చర్య కాదని చిరంజీవి వారితో అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో గురువారం మధ్యాహ్నం నుంచి కొంత మంది కాంగ్రెస్ నాయకులు లాబీయింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కొంతమంది కాంగ్రెస్ శాసన సభ్యులు చిరంజీవి వద్దకు వెళ్లారు.
ఇదిలావుండగా కొంత మంది మంత్రులు టీవీ ఛానెళ్ల కెమెరాల ముందు నిలబడి వరుసగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెబుతూ వచ్చారు. మరికొంతమంది తాము పార్టీనే వీడుతామని ప్రకటించారు. రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... తనకు మంత్రిపదవి రావడానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డే కారణమన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఖచ్చితంగా చెప్పారు.