పేదలు, రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడిన తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఆయన తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తన తండ్రి దుర్మరణ వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో ఆయన మీడియా ద్వారా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి చేశారు.
తన తండ్రి అడుగు జాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఎలాంటి అఘాయిత్యాలకు, ఆత్మహత్యలకు పాల్పడవద్దని జగన్ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే ఆయన ఏ లోకంలో ఉన్నా ఆత్మక్షోభిస్తుందని చెప్పుకొచ్చారు. వైఎస్ ఇచ్చిన స్ఫూర్తితోనే ముందుకు సాగుదామని, అదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.