దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆప్తమిత్రుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావుతో సినీ హీరో యువసామ్రాట్ నాగార్జున శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కేవీపీ నివాసానికి ఉదయాన్నే వెళ్లిన నాగ్.. ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు.
ఈ సమావేశానంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అత్యంత అప్తమిత్రుడైన డాక్టర్ కేవీపీతో.. వైఎస్ మరణానంతరం సమావేశమయ్యేందుకు వీలు చిక్కలేదన్నారు. వైఎస్ దుర్మరణం అనంతరం కేవీపీ మరింత బిజీగా గడుపుతున్నారన్నారు. దీంతో ఆయన్ను కలుసుకోలేక పోయినట్టు చెప్పారు.
ప్రస్తుతం కేవీపీకి వీలు చిక్కడంతో సమయం కేటాయించారని, అందువల్ల ఆయనతో సమావేశమై పరామర్శించినట్టు నాగ్ చెప్పారు. ఇకపోతే.. వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిలో ఉన్న లక్షణాలు వైఎస్ జగన్లో ఉన్నాయన్నారు.
అంతేకాకుండా, వైఎస్ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చే సత్తా జగన్లో ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడించాలని వైఎస్ కలలు కన్నారని, వాటిని నెరవేర్చగలికే వ్యక్తి జగన్ అన్నారు. అందువల్ల ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్నది తన అభిప్రాయమని నాగార్జున మరోమారు తన మనస్సులోని మాటను వెల్లడించారు.