ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ను సీఎం చేయాలని కోరడం తప్పుకాదు: రోశయ్య (Jagan | CM | Rosaiah | Congress | YS | Sonia | Bashirbaga | Press Club)
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని యువకులతో పోటీ పడే శక్తి తనకు లేదని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.దుర్మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని వస్తున్న డిమాండ్లలో ఎలాంటి తప్పులేదన్నారు. అలాంటి డిమాండ్లు రావడం సహజమేనన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మంగళవారం హైదరాబాద్లోని బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విధిలేని పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.
అంతేకానీ, తనకు సీఎం పీఠంపై కూర్చోవాలనే ఆశగానీ, కోరిక గానీ తనకు ఏ కోశానా లేదన్నారు. వైఎస్ దుర్మరణం వ్యక్తిగతంగానే కాకుండా, రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి తీరని లోటన్నారు. అలాంటి నేత వారసుడుని సీఎం చేయాలని పలువురు నేతలు డిమాండ్లు చేయడంలో తప్పులేదన్నారు.
అదేసమయంలో తనకు యువకులతో పోటీ పడే శక్తి లేదన్నారు. తనకు ఎవరితోనూ వైరం లేదన్నారు. అయితే, కాంగ్రెస్ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా శక్తిమేరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.