ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నేను ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తుంది: వైఎస్ జగన్ (Kadapa MP | Y S Jaganmohan Reddy | chief minister | Congress | CM post)
కోట్లమంది తెలుగువారి ఆదరాభిమానాలతో తాను ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మనసులోని కోరికను బయటపెట్టారు. ప్రజలు, పార్టీ అండదండలతో తను ఖచ్చితంగా ఆ పదవిని అలంకరిస్తానన్నారు.
పాత్రికేయులతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవరినీ అడగలేదని చెప్పారు. అయితే సీఎం పోస్టును కోరుకోవడంలో తప్పేమీ లేదని అనుకుంటున్నట్లు వెల్లడించారు. నిజానికి తను ముఖ్యమంత్రి పదవికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును గురించే ఆలోచన చేస్తున్నానని అన్నారు.
తనకు 36 సంవత్సరాలు మాత్రమేననీ, ఇంకా రాజకీయ ప్రయాణం చాలా ఉందని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని కోరుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అయితే తన తండ్రి చేపట్టి మిగిల్చిపోయిన బృహత్తర కార్యక్రమాలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉన్నదని అన్నారు. అందుకోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు వెళతాననీ, పదవి తనకు ముఖ్యం కాదన్నారు. అయితే ఆ పదవిని ప్రజలు, పార్టీ తనకు ఖచ్చితంగా కట్టబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.