సినీ నటులైన రాజశేఖర్, జీవిత దంపతులను తమ పార్టీ కార్యకర్తలు బట్టలూడదీసి కొట్టడం ఖాయమని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. తమ పార్టీ అధినేత చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు, స్థాయి వారికెక్కడదని ఆమె దుయ్యబట్టారు.
సినిమా రంగంలో చిరంజీవికి ఎదురు నిలవలేకపోయిన రాజశేఖర్ వ్యక్తిగత ఈర్ష్యతోనే చిరంజీవిపై పలుమార్లు నోరు పారేసుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జీవిత, రాజశేఖర్ల గురించి వ్యాఖ్యానించాలంటేనే అసహ్యం వేస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. జీవిత, రాజశేఖర్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తమ కార్యకర్తలు బట్టలూడదీసి కొట్టడం ఖాయమని ఆమె హెచ్చరించారు.
ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత శోభారాణి మాట్లాడుతూ.. సినిమాల్లో మెగాస్టార్గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లో కూడా మెగాస్టారే అన్నారు. జీవిత, రాజశేఖర్ హైదరాబాద్లోని ఒక్క డివిజన్లో పోటీ చేసి గెలవగలరా అని శోభారాణి సవాల్ చేశారు. తమ పార్టీ అధినేతపై విమర్శలు చేసే ముందు రాజశేఖర్ను తెలుగు నేర్చుకోవాలని సూచించారు.
వైఎస్ జీవించి ఉన్న సమయంలో ప్రయోజనం పొందడం వల్లే వారిద్దరు అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ అంతా చిరంజీవే అన్న విషయం త్వరలోనే రుజువు అవుతుందన్నారు. తమ పార్టీ ప్రాధాన్యాన్ని, విధానాలను గుర్తించినందువల్లే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తమతో పొత్తుకు ముందుకు వచ్చిందని శోభారాణి అన్నారు.