ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ధైర్య వచనాలు చెప్పారు. తాజా సంఘటనకు బాధపడకు. అధైర్యపడవద్దు. పొత్తు విడుపుకు పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నా. భవిష్యత్లో "స్నేహాస్తం" కలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అని చిరంజీవికి పీసీసీ చీఫ్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
పొత్తు చర్చలు ఆకస్మికంగా ఆగిపోవడం పట్ల చిరంజీవి మనోవేదన చెందరాదని, ముఖ్యంగా నిరుత్సాహం చెందకుండా తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో నిమగ్నం కావాలని డీఎస్ సూచించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధే పట్టం కడుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.
అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. ఇకపోతే.. కాంగ్రెస్-ప్రరాపా మధ్య పొత్తు పొడుపుకు బ్రేక్ పడటం తాత్కాలికమేనని చెప్పారు. భవిష్యత్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని డీఎస్ అనుచరులు అంటున్నారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వారికి అన్యాయం జరుగరాదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, ఈ పొత్తు వికటించడం వల్ల జగన్ వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా, డీఎస్ వర్గం మాత్రం పైఎత్తుల్లో నిమగ్నమైవుంది.