ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ సంస్థ అధినేత గాని జనార్ధన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఓబుళాపురం గనుల త్రవ్వకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు.
ఓఎంసీకి గనుల లీజును కేటాయించింది చంద్రబాబేనని రాజగోపాల్ ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బాబు.. అపుడు మిన్నకుండి ఇపుడు లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకపోతే.. ఓఎంసీ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు.
గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్.జగన్ చేస్తున్న ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఈ ప్రచారంలో చంద్రబాబును తీరును మాత్రమే జగన్ ఎండగడుతున్నారని, ఇందులో ఎలాంటి తప్పులేదని లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.