రాష్ట్రంలోని ఖనిజ సంపదను కర్ణాటకకు చెందిన గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ఆరోపించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు సుప్రీం సాధికారిక కమిటీ స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
దీనిపై ఆయన ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతుందా.. లేదా మైనింగా మాఫియా రాజ్యం సాగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇనుప ఖనిజం తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తున్నా ప్రభుత్వం మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మైనింగ్ మాఫియా లూటీ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఓఎంసీ కంపెనీ యాజమాన్యాన్ని అడ్డుకోవాలని మాజీ మంత్రి కోడెల డిమాండ్ చేశారు.