గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల సమరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
చిన్నపాటి గొడవలు మినహా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదని ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ గొడవలకు సంబంధించి 12 కేసులు నమోదు కాగా, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. అధికారులు పారదర్శకంగా పనిచేయడం వల్లే గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి కృష్ణబాబు కితాబిచ్చారు.
అలాగే కొత్తగా కలిసిన మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదైందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎస్పీ సింగ్ తెలిపారు. మల్కార్గిరి డివిజన్లో 42వ పోలింగ్ కేంద్రంలో రీ-పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 26 మధ్యాహ్నానికల్లా కౌంటింగ్ పూర్తవుతుందని సింగ్ వెల్లడించారు. 28 కేంద్రాల్లో 55 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుందని సింగ్ తెలిపారు.