ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కుటుంబ సభ్యులతో నేడు జగన్ మంతనాలు! (Pulivendula | Ticket | YS | Jagan | Sonia | By poll | YS.Vivekananda Reddy)
పులివెందుల టిక్కెట్ కేటాయింపు అంశం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులందరితో చర్చించి, ఒక ఏకాభిప్రాయానికి రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన తన కుటుంబ సభ్యులందరినీ హైదరాబాద్కు పిలుపించుకున్నారు.
వాస్తవానికి జగనే పులివెందులకు వెళ్లాల్సివుంది. అయితే, అక్కడకు స్వయంగా వెళ్లితే కుటుంబంలో ఉన్న విభేదాలు మరింతగా బహిర్గతం అవుతాయని సన్నిహితులు చెప్పడంతో ఆయన తన పులివెందుల పర్యటనను వాయిదా వేసుకున్నారు. తనకు బదులుగా తమ బంధువులనే రాష్ట్ర రాజధానికి రావాలని కోరారు.
పులివెందుల స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన వైఎస్ దుర్మరణం చెందడంతో ఈ స్థానానికి వచ్చేనెల 19వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఇక్కడ పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి వైఎస్.సతీమణి విజయలక్ష్మీని పోటీ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా కోరారు.
అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించేందుకు ఆమె ససేమిరా అన్నారు. దీంతో ఈ టిక్కెట్పై వైఎస్ సోదరుల కుమారులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, పులివెందుల పాలనా పనులను చక్కదిద్దుతూ వచ్చిన వైఎస్ సోదరుని కుమారుడు వైఎస్.భాస్కర రెడ్డి టిక్కెట్పై బలమైన ఆశలు పెట్టుకున్నారు.
తాజాగా ఇదే స్థానానికి తాను గానీ లేదంటే.. తన సతీమణి సౌభాగ్యను గానీ పోటీలో దించాలని ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి గట్టిగా భావిస్తున్నారు. అయితే, వైఎస్ మృతి చెంది మూడు నెలలు కూడా పూర్తికాక ముందే కుటుంబ సభ్యులు, దాయాదుల మధ్య పులివెందుల ఉప ఎన్నిక టిక్కెట్ కోసం విభేదాలు రచ్చకెక్కడం ఏమంత మంచిది కాదని వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న కొందరు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.