ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి కే.కేశవరావుకు వైఎస్సార్ తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదట. అసలు ఆయన ఎలా ఉంటారో కూడా ఏనాడు తాను చూడలేదని సెలవిస్తున్నారు. పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆయన మంగళవారం తిరుచానూరుకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వైఎస్.జగన్ చేసిన ప్రచారంపై స్పందించమని అడిగినప్పుడు కేకే చిద్విలాసంగా నవ్వేశారు. పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చాలామంది చేస్తారు. అయితే ఓట్లు పడాలి కదా అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పెద్ద నాయకుడు కనుక తనకు తెలుసన్నారు. జగన్ అంటే ఎవరంటూ కేకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడం ఖాయమని కేకే ధీమా వ్యక్తం చేశారు. తాను దైవదర్శనం కోసం వచ్చానని, అందుకే రాజకీయాలు మాట్లాడబోనంటూ కేకే చెప్పి అక్కడ నుంచి నిష్క్రమించారు.