గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు ఇంత సోమరిపోతులని తాను ఏనాడూ ఊహిచుకోలేదని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ మండిపడ్డారు. క్రికెట్ టిక్కెట్ల కోసం రేయింబవుళ్లు క్యూలలో నిలుచుంటారన్నారు. అదే ఐదేళ్ళ పాటు మనలను పాలించే వారిని ఎన్నుకునేందుకు ఆయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకే ఒక గంట పాటు క్యూలో నిలబడి ఓటు వేయలేక పోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సోమవారం జరిగిన పోలింగ్లో అతి తక్కువ శాతం ఓటింగ్ జరగడం పట్ల జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ చూసేందుకు టిక్కెట్ల కోసం ఒక రోజు ముందు రాత్రంతా దుప్పట్లు పరుచుకొని జాగారం చేశారని, అదే ఐదేళ్ళ పాటు మన జీవితాలను ప్రభావితం చేసే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక్క గంట సమయం కేటాయించలేక పోయారన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయనే దాని కన్నా ఓటింగ్ శాతం తగ్గడమే తనకు అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఓటర్లలో ఇలాంటి నిరాసక్తత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని ఆయన హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నెలకొన్న బహుముఖ పోటీలో ప్రస్తుతం పోలైన 44 శాతం ఓట్లలో 15 శాతానికి మించి ఓట్లు వచ్చిన పార్టీ విజయం దక్కించుకుంటుందన్నారు.