ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణా మంత్రులవి తప్పుడు రాజీనామాలు: నాగం (Nagam Janardhan Reddy | Telangana | Resignations | Ministers)
తెలంగాణా లక్ష్య సాధనకంటూ తెలంగాణా మంత్రులు సమర్పించిన రాజీనామా పత్రాలకు విలువే లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. 13 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక కాగితంపై సంతకం చేసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపడాన్ని ఆయన తప్పుబట్టారు.
మంత్రులు చిత్తశుద్ధితో రాజీనామా చేయదలచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికో లేదంటే రాష్ట్ర గవర్నరుకో సమర్పించుకోవాలి కానీ, కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించడమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఇలా ప్రజలను ఎప్పటి నుంచో మోసం చేస్తూ వస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణా జేఏసి గర్జనకు ప్రభుత్వం భేషరతుగా అనుమతి ఇవ్వాలని నాగం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఎత్తివేయాలన్నారు. తనపై దాడి చేసినవారు విద్యార్థులైతే వారిపై కేసులు ఉన్నట్లయితే వాటిని తను తక్షణమే ఉపసంహరించుకుంటానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పిలుపుపై తమ నాయకుడు చంద్రబాబు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారనీ, ఐదవ తేదీలోపు ఒక నిర్ణయానికి వస్తారని వెల్లడించారు.