జనవరి 5వ తేదీన తెలంగాణా అంశంపై కేంద్రం 8 పార్టీలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఢిల్లీలో సీమాంధ్ర నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ ప్రాంత నాయకులు శనివారం విజయవాడ, గుంటూరు నగరాల్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్రకు చెందిన నాయకులతోపాటు, విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు పాల్గొననున్నారు.
డిసెంబరు 30వ తేదీన కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటనపై సీమాంధ్ర ప్రజలలో అపోహలున్నాయని సీమాంధ్ర జేఏసి అభిప్రాయపడింది. ఈ మేరకు తమ అభిప్రాయాలను రాష్ట్ర స్థాయి నేతలతోపాటు ఢిల్లీ నాయకులకు తెలియజేస్తామన్నారు.
తెలంగాణా సమస్య అంశంలో తెరాస, సీపీఎం, ఎంఐఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ నిట్టనిలువునా చీలిపోయాయనీ, ఇటువంటి పరిస్థితిలో ఆయా పార్టీలతో చర్చల వల్ల ఫలితం ఏమీ ఉండదని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నందున చర్చల్లో వారిని కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
సమైక్యాంధ్రకోసం కేంద్రంపై ఎటువంటి వత్తిడి తీసుకురావాలన్నదానిపై సీమాంధ్ర జేఏసి వ్యూహరచన చేయనుందని నాయకులు వెల్లడించారు.