ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.
దీనిపై శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్లో స్పందన తెలియజేస్తూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం వేసిన కమిటీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన మాటను తప్పే పార్టీ కాంగ్రెస్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా దృష్టి కేంద్రీకరించిందన్నారు. అందువల్ల కేంద్రం తీసుకునే చర్యలకు ప్రతి పార్టీ, ప్రతి నేత సహకరించాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారానికి కమిటీ వేసినందువల్ల అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిదేనని డీఎస్ అభిప్రాయపడ్డారు.