ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైష్ణవి హత్య కేసు: వెంకట్రావుకు 22 వరకు రిమాండ్! (Vaishnavi | Mudrer | Venkatrao | Remand | Vijayawada | Magistrate)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు వెంకట్రావ్ గౌడ్ను సోమవారం స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్కు పంపుతూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయనను జిల్లా జైలుకు తరలించారు.
వెంకట్రావ్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చకుండా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చడాన్ని ప్రజాసంఘాలు తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంకట్రావ్కు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి వెంకట్రావ్ను మూడు రోజుల క్రితమే అరెస్టు చేసినప్పటికీ రహస్యంగా ఉంచినట్లు వారు ఆరోపిస్తున్నారు.
ఆస్తి గొడవల కారణంగా తొమ్మిదేళ్ళ నాగ వైష్ణవిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసులో వెంకట్రావ్ గౌడ్ కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న వెంకట్రావు ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆయనను ఆదివారం అరెస్టు చేసి, సోమవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.